ముస్లిం అయితే ఖచ్చితంగా భారత్ ని వ్యతిరేకించి తీరాలట .. స్టేట్మెంట్ ఇచ్చిన పాకిస్థాన్
మొగుడు మొట్టినందుకు కాదు.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు తయారైంది పాకిస్థాన్ పరిస్థితి. హిందూస్థాన్తో నేరుగా ఉన్న వైరం కన్నా, ఆఫ్ఘనిస్థాన్ భారత్ను మెచ్చుకుంటుందన్న వాస్తవమే పాకిస్థాన్ను లోలోపల దహించివేస్తోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ, దాయాది దేశంగా మనపై విషం కక్కుతున్న పాక్.. ఇప్పుడు తన ప్రాబల్యం తగ్గుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
ఆఫ్ఘనిస్థాన్ వ్యవసాయ శాఖ మంత్రి, తాలిబాన్ నేత మౌల్వీ అతావుల్లా ఒమారీ ఇటీవల భారతదేశంలో పర్యటించినప్పుడు, “భారత్, ఆఫ్ఘనిస్థాన్ ప్రజల డీఎన్ఏ (DNA) ఒక్కటే” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. భారతదేశంతో ఆఫ్ఘనిస్థాన్ పెంచుకుంటున్న ద్వైపాక్షిక సంబంధాలను చూసి ఓర్వలేక, పాకిస్థాన్ నాయకత్వం ఈ డీఎన్ఏ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో అక్కసు వెళ్లగక్కింది.
పాకిస్థాన్ సైనిక అధికార ప్రతినిధి, డీజీ ఐఎస్పీఆర్ (DG ISPR) అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ, తాలిబాన్ల ఇస్లామిక్ విశ్వాసాలనే ప్రశ్నించారు. ముస్లింలు కాఫిర్లతో (అవిశ్వాసులతో) స్నేహం చేయకూడదని సూచించే ఖురాన్ వాక్యాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. హిందూ దేశమైన భారతదేశంతో స్నేహం చేయడం ద్వారా తాలిబాన్లు ఇస్లాంకి దూరం అవుతున్నారని పరోక్షంగా విమర్శించారు. అంతటితో ఆగక, భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని “యజమాని-బానిస” సంబంధంగా అభివర్ణించారు.
అయితే, పాకిస్థాన్ చేసిన ఈ విమర్శలు వారి ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెడుతున్నాయి. ఒకపక్క తాలిబాన్ల ఇస్లామిక్ విలువలను ప్రశ్నిస్తున్న పాకిస్థాన్, దశాబ్దాలుగా అమెరికా లాంటి దేశాలతో ఎలా సన్నిహితంగా మెలిగిందో ప్రపంచానికి తెలుసు. ఇస్లామిక్ దేశాలను వ్యతిరేకించే ఇజ్రాయెల్కు అండగా నిలిచే అగ్రరాజ్యాలకు పాకిస్థాన్ వత్తాసు పలకడం వారి కపటత్వానికి నిదర్శనం. ఇలాంటి దిగజారుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ తన బుద్ధి ఏంటో మరోసారి బట్టబయలు చేసుకుంది. అంతేకాదు, “పాకిస్థాన్లో కూడా ఉండేది మనుషులే కదా” అంటూ అక్కడ వారికి వత్తాసు పలికే కొందరు భారతీయుల మెంటాలిటీ కూడా అచ్చం పాకిస్థాన్ ఆలోచనా ధోరణిలాగే తయారయ్యింది. ఏది ఏమైనా, భారతదేశం సాధిస్తున్న దౌత్య విజయాలను చూసి దాయాది దేశం పాకిస్థాన్ కుళ్లుకుంటోందన్నది మాత్రం అక్షర సత్యం.


