జనసేన ‘షెల్టర్’లో వైసీపీ బినామీ! గుడిపాటి సీతారాం చేరిక వెనుక ‘ఎస్కేప్’ స్కెచ్?
అమరావతి, జులై 10: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో అండదండలతో అక్రమ దందాలు సాగించిన కొందరు నేతలు, ఇప్పుడు చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవడానికి సరికొత్త వ్యూహాలకు తెరలేపారు. సేఫ్ షెల్టర్ కోసం అధికార కూటమిలోని పార్టీల వైపు చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి గుడిపాటి సీతారాం చేరిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుడిపాటి సీతారాం ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్గా, వ్యాపారవేత్తగా సమాజంలో చలామణి అవుతున్నప్పటికీ, ఆయన వెనుక పెద్ద రాజకీయ నెట్వర్క్ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీకి చెందిన కొందరు కీలక అవినీతి నేతలకు ఆయన బినామీగా వ్యవహరించారనే ప్రచారం బలంగా సాగుతోంది. అధికారం ఉన్నంత కాలం తెర వెనుక ఉండి చక్రం తిప్పిన ఈ బినామీ వ్యవహారం, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వెలుగులోకి వస్తోంది.
ఇటీవల చోటుచేసుకున్న కేఎన్ఆర్ అరెస్ట్ ఉదంతంతో బినామీ నేతల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. తదుపరి టార్గెట్ తామే కావచ్చునేమోననే భయంతో, చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవడానికి ‘ఎస్కేప్ స్కెచ్’ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలవడం, ఆ తర్వాత సీతారాం తన పాత వ్యూహాలకు మళ్లీ పదును పెట్టడం వెనుక ఉన్న అసలు రంగులు బయటపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు అందినకాడికి దోచుకోవడం, దాచుకోవడం కొందరి అంతిమ లక్ష్యంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. తాము నమ్ముకున్న పార్టీ నామరూపాలు లేకుండా పోయినప్పుడు, చోటామోటా నాయకుల నుంచి పెద్ద లీడర్ల వరకు అందరూ సేఫ్ షెల్టర్ల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, ఈ మూడు పార్టీలలో ఏదో ఒకదాని పంచన చేరి తమ గత పాపాలను కడిగేసుకోవాలని చూస్తున్నారు. తమ పాత అక్రమాలను మసిపూసి మారేడుకాయ చేసి, రంగులు మార్చే ఊసరవెల్లి రాజకీయాలకు కొందరు తెరలేపుతున్నారనే ఆరోపణలు ఈ చేరికతో స్పష్టమవుతున్నాయి.
జనసేన పార్టీలోకి గుడిపాటి సీతారాం చేరిక వెనుక ఉన్న ఈ బినామీ లింకులు, ఎస్కేప్ ప్లాన్లపై రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది


