కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మార్మోగుతున్న ‘స్వచ్ఛ పాఠశాల’ నినాదం
టెన్త్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, పరీక్ష ఫీజుల చెల్లింపునకు బండి సంజయ్ హామీ
నాయకులు ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, చేతల్లోనూ ఆదర్శంగా నిలవాలని నిరూపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనా స్ఫూర్తితో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘స్వచ్ఛ పాఠశాల’ మహాక్రతువుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఆయన, సామాన్య కార్యకర్తలా మారిపోయారు.
స్వయంగా చీపురు పట్టి తరగతి గదులను ఊడ్చారు. పైపుతో నీళ్లు చల్లి, విద్యార్థులు కూర్చునే బల్లల కింద పేరుకుపోయిన దుమ్ముధూళిని తొలగించి, గదులను అద్దంలా మెరిపించారు. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా శ్రమదానం చేయడం స్థానికులను, విద్యావేత్తలను విశేషంగా ఆకర్షించింది.
క్షేత్రస్థాయిలో కదిలిన క్యాడర్, జనం
కేంద్ర మంత్రి పిలుపుతో కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో శ్రమదానం వెల్లువెత్తింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏకమయ్యారు. స్థానిక ప్రజలు తమ ఇళ్ల నుంచే చీపుర్లు, బకెట్లు, ఇతర సామాగ్రి తెచ్చుకుని స్వచ్ఛందంగా బడులను శుభ్రపరుస్తుండటం విశేషం.
విద్యార్థులకు వరాల జల్లు.. కీలక ప్రకటనలు
శ్రమదానం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలిచేందుకు పలు కీలక హామీలు ప్రకటించారు:
- ఉచిత సైకిళ్ల పంపిణీ: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ విద్యా సంవత్సరం ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు.
- సొంత వేతనం నుంచి ఫీజులు: టెన్త్ విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా, వారి వార్షిక పరీక్ష ఫీజులన్నింటినీ తన సొంత జీతం నుంచి చెల్లిస్తానని ప్రకటించారు.
- నమోదు పెంపుకై ర్యాలీలు: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో, రానున్న రోజుల్లో గ్రామాలు, మండలాల వారీగా ప్రత్యేక అవగాహన ర్యాలీలు (బడిబాట తరహాలో) నిర్వహించనున్నట్లు తెలిపారు.
“రాజకీయాలకు అతీతంగా మన ప్రభుత్వ పాఠశాలలను మనమే బాగుచేసుకోవాలన్నదే నా తపన. దీనికోసం నిన్ననే ‘టిఫిన్ బైఠక్’ నిర్వహించి కచ్చితమైన కార్యాచరణ సిద్ధం చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, ఇతర సమస్యలపై త్వరలోనే క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.”
— బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ఒక కేంద్ర మంత్రి తీసుకున్న ఈ చొరవపై నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


