బండి సంజయ్ పై తప్పుడు ప్రచారాలకు చెక్.!. బేతి మహేందర్ రెడ్డిపై జనసేన వేటు!
హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లక్ష్యంగా జరుగుతున్న కుట్రలు, సోషల్ మీడియా దుష్ప్రచారాలకు బ్రేక్ పడింది. గత కొంతకాలంగా వ్యక్తిగత కక్షతో కేంద్ర మంత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బేతి మహేందర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను మహేందర్ రెడ్డిని పార్టీ నుంచి కొంతకాలం పాటు దూరంగా ఉంచుతున్నట్లు తెలంగాణ జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.

అసలేం జరిగింది?
గతంలో కార్పొరేటర్ టికెట్ దక్కలేదనే అక్కసుతో బేతి మహేందర్ రెడ్డి.. బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పలు యూట్యూబ్ ఛానళ్లలో ఇష్టానుసారం మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న బండి సంజయ్ అల్లుడిని టార్గెట్ చేస్తూ ‘ఐ-న్యూస్’ (I News) తో పాటు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్ల వేదికగా ఒక ఫేక్ న్యూస్ ను వ్యూహాత్మకంగా సర్క్యులేట్ చేశారు. అయితే, ఆ వార్త పూర్తిగా అవాస్తవమని తేలడం, అడ్డంగా దొరికిపోతామనే భయంతో సదరు ఛానళ్లు వెంటనే ఆ వీడియోలను తొలగించాయి.
వెలుగులోకి కుట్ర కోణం..
ఈ ఫేక్ న్యూస్ ప్రచారం వెనుక పెద్ద కుట్ర కోణమే దాగి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారశైలి తరహాలోనే.. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ (BRS) వర్గాలు ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, ఆ తర్వాత డిలీట్ చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో బేతి మహేందర్ రెడ్డి కూడా వారితో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ, జర్నలిస్ట్ తిరుపతి మాట్లాడిన ఒక ఆడియో కాల్ రికార్డ్ బయటకు రావడం ఈ కుట్రను మరింత బట్టబయలు చేసింది.
మిత్రధర్మం పాటించిన జనసేన..
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో (NDA) కీలక మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ.. తెలంగాణలోనూ అదే బాధ్యతను, క్రమశిక్షణను ప్రదర్శించింది. “వ్యక్తిగత విభేదాలను పార్టీకి ముడిపెడితే ఉపేక్షించేది లేదు” అంటూ తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. మహేందర్ రెడ్డిపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో, నిజానిజాలు తేలేవరకు ఆయనను పార్టీకి దూరంగా ఉంచుతున్నట్లు సస్పెన్షన్ వేటు వేశారు. ఒక కేంద్ర మంత్రిపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తిపై జనసేన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు, బండి సంజయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారికి చట్టపరంగా కూడా శిక్ష తప్పదనే హెచ్చరికలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.


