-జర్నలిస్ట్ శిరీష
ఏపీ తదుపరి సీఎం ఎవరు? జగనా? నారా లోకేషా?
ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రజలను మెప్పించే నాయకుడు, వారి లబ్ధి, సంక్షేమం మరియు అభివృద్ధి గురించి ఆలోచించే వారికి మాత్రమే ప్రజలు మరలా అవకాశం ఇస్తారు. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వ పాలన, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు, నారా లోకేష్ భవిష్యత్తు మరియు పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిపై నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ తదుపరి సీఎం ఎవరు అవుతారనే దానిపై ఒక సుదీర్ఘ, వాస్తవిక గ్రౌండ్ రిపోర్ట్.

వైఎస్ఆర్సిపి పతనానికి కారణాలు.. 11 సీట్లకే ఎందుకు పరిమితమైంది?
2019లో వైఎస్ఆర్సిపికి అధికారమిచ్చి ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఆ ఐదేళ్ల పరిపాలన అంతా కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతిపక్ష నేతలపై కేసులతోనే సాగిపోయింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు పై కూడా కేసులు పెట్టి జైలుకు పంపిన విషయం అందరికీ తెలిసిందే. కేవలం బటన్ నొక్కి జనాలకు సంక్షేమ పథకాలు అందించడమే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆయన చుట్టూ ఉన్న సలహాదారుల ఉచిత సలహాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎన్నికల ముందు అమరావతిని రాజధానిగా ఉంచుతామని మాటిచ్చి, ఆ తర్వాత అమరావతి రైతులపై వారు చేసిన దాష్టీకం, మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట ప్రజలు గమనించారు. బటన్ నొక్కి సంక్షేమం ఇస్తున్నానని చెప్పుకున్నా, ఎలక్షన్లలో ప్రజలు ఈవీఎం బటన్ నొక్కి ఎలాంటి తీర్పు ఇచ్చారో మనం చూశాం. గతంలో ఒక్క సీటు కూడా రాని జనసేన 100% స్ట్రైక్ రేట్ తో బ్రహ్మాండమైన విక్టరీ సాధించగా, జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక 11 సీట్లకే పరిమితమై, కేవలం ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయారు.

కూటమి సర్కార్ సవాళ్లు.. సోషల్ మీడియా యుద్ధాలు
అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతూ, ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల భారాన్ని నెత్తిన వేసుకుంది. వాటిని అధిగమిస్తూనే, సంక్షేమ పథకాలపై కూడా దృష్టి పెడుతూ ప్రజలకు లోటు లేకుండా పరిపాలిస్తోంది. కానీ ప్రజలు, మీడియాలోని ఒక వర్గం ఇంకా పూర్తి సంతృప్తి చెందలేదు. కారణం, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న స్పీడ్ (Speed of Doing Business) ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం.
దీనికి తోడు, సాక్షి పత్రిక మరియు వైసీపీ సోషల్ మీడియా విభాగాలు డేగ కళ్ళతో ఎదురుచూస్తూ, ప్రభుత్వం చేసే చిన్న తప్పును కూడా బూచిలాగా చూపిస్తూ ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా విభాగాలు ప్రభుత్వ విజయాలను ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయడం మానేసి, జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారాలపై యుద్ధం చేయడానికే సమయం కేటాయిస్తున్నాయి. 2019లో చేసిన కమ్యూనికేషన్ లోపాన్నే మళ్లీ రిపీట్ చేస్తున్నారా? అభివృద్ధిని చెప్పుకోలేకనే అప్పట్లో నష్టపోయారు అన్న వాదనను ఈ కూటమి సర్కార్ గుర్తుంచుకోవాలి.

నారా లోకేష్ వ్యూహం: ప్రతీకారమా? అభివృద్ధా?
నారా లోకేష్ గతంలో చేసిన ‘యువగళం’ పాదయాత్ర అంచనాలకు మించి జనాదరణ పొందింది. దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న తీవ్ర వ్యతిరేకత. పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు, ముఖ్యంగా కార్యకర్తల్లో జోష్ నింపడానికి ప్రయోగించిన ‘రెడ్ బుక్’ (Red Book) కాన్సెప్ట్ సక్సెస్ అయింది. తాము బలమైన రివెంజ్ తీర్చుకుంటామనే సంకేతాలు ఇవ్వడంలో లోకేష్ అప్పట్లో విజయం సాధించారు.
కానీ ఇప్పుడు అధికారం వచ్చాక, చంద్రబాబు లాంటి స్పీడ్ ను లోకేష్ నుండి జనాలు ఆశిస్తున్నారు. రెడ్ బుక్ లో ఉన్న ప్రధాన నాయకులైన రోజా, కొడాలి నాని లాంటి వారిని ఇంకా ఏమీ చేయలేకపోతున్నారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దీనికి లోకేష్ “మనం అభివృద్ధి చేయడానికి వచ్చాం, ఎవరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి కాదు” అని సమాధానం ఇస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు ఇది మింగుడు పడటం లేదు. తమను అంత హింసించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే వాదన బలంగా ఉంది. కార్యకర్తలను బుజ్జగించడం కష్టంగా మారుతోంది. అయితే, నాయకులపై ఉన్న నమ్మకంతోనే ఇటీవల జరిగిన టీడీపీ మెంబర్ షిప్ డ్రైవ్ లో కార్యకర్తలు రికార్డు సృష్టించారన్నది వాస్తవం.
లోకేష్ పని ఒత్తిడి, బిజీ షెడ్యూల్స్ వల్ల అమెరికా (డల్లాస్), ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు వెళ్తుండటం వల్ల ప్రజలతో ఇంటరాక్షన్ తగ్గుతోందన్న భావన ఉంది. నాయకుడు గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్తేనే ప్రజాదరణ నిలబడుతుంది. మంగళగిరిలో పెడుతున్న ‘ప్రజా దర్బార్’ తరహాలో, నెల మొత్తం ఒక రోస్టర్ సిస్టమ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో ఇంటరాక్ట్ అయితే జగన్ రాజకీయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అలా చేస్తే నెక్స్ట్ సీఎం అవ్వడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జగన్ ద్వంద్వ వైఖరి: అసెంబ్లీకి ఎందుకు భయపడుతున్నారు?
అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ ఉదంతం జరిగినా, సొంత బాబాయ్ చనిపోయినా, టీడీపీ కార్యకర్తలను చంపేసినా, ఒక దళితుడిని కిరోసిన్ పోసి తగలబెట్టినా స్పందించని జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వాలిపోతున్నారు. అధికార మోజు తీరిపోయిన తర్వాత కేవలం రాజకీయ లాభం కోసమే ఆయన ఈ విధంగా స్పందిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు.
మరోవైపు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారిని కౌరవ సభలో కొడాలి నాని, రోజా లాంటి వారు ఇష్టమొచ్చినట్టు కారుకూతలు కూస్తున్నా జగన్ నవ్వుతూ కూర్చున్నారు కానీ వారిని వారించలేదు. అప్పుడు తాను చేసిన తప్పులకు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే రివెంజ్ తీర్చుకుంటారని భయపడుతున్నారా? పులివెందుల పులి అని చెప్పుకునే జగన్, అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు?
కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న అక్కసుతో అసెంబ్లీకి వెళ్లకపోవడం సరికాదు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే అన్న సత్యం మర్చిపోకూడదు. పులివెందుల నియోజకవర్గ ప్రజల కష్టాలు, అవసరాల గురించి అసెంబ్లీలో మాట్లాడకపోతే, 2027లో పాదయాత్రకు వచ్చినప్పుడు “మా సమస్యలే అసెంబ్లీలో చెప్పని నువ్వు, రేపు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు?” అని ప్రజలు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు?

పవన్ కళ్యాణ్: సినిమాటిక్ కోపం నుండి రాజకీయ పరిపక్వత వైపు?
ఈ రాజకీయ చదరంగంలో మరో కీలక పాత్ర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఇంకా ఒక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిలా పరిపక్వత చెందలేదనే విమర్శలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి సినిమాలోలాగా ‘యాంగర్ మేనేజ్మెంట్’ (Anger Management) జీరోలో ఉంది. రాజకీయం అంటే పులి మీద స్వారీ లాంటిది, వీధి కొట్లాట కాదు అన్నది ఆయన గ్రహించాలి. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ చిన్నచిన్న విమర్శలకు కూడా ట్రిగ్గర్ అయిపోయి, “నా కొడకల్లారా మీ సంగతి చూస్తా, తొక్కుతా” అని మాట్లాడటం కరెక్ట్ కాదు. లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకునే అధికారం ఆయనకు లేదు.
రాగద్వేషాలు లేకుండా, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్ట్, కేఏ పాల్ పార్టీ అని చూడకుండా అందరినీ సమానంగా చూస్తానని మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన, ఆ మాట మర్చిపోతున్నారు. ఏపీలో గత వైసీపీ హయాంలో జరిగిన ‘కాపులు వర్సెస్ దళితులు’ అనే ఘర్షణ వాతావరణాన్ని ఆయన వ్యాఖ్యలు మళ్లీ రెచ్చగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన యాంగర్ మేనేజ్మెంట్ ను ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటారో అప్పుడే నిజమైన పొలిటీషియన్ అవుతారు.
ఇక సనాతన ధర్మం విషయానికొస్తే.. కేవలం ఆవేశంగా స్పీచ్ లు ఇవ్వడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. తమిళనాడులో నటుడు విజయ్ చెప్పినట్లుగా, ఏ గుడి ఆదాయం ఆ గుడిలోనే ఖర్చుపెట్టాలి అన్నది ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలి. తిరుపతి, శ్రీశైలం, అప్పన్న గుడి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ‘హ్యూమన్ రిసోర్స్ ఫండ్’ కింద ఎందుకు వాడుకోవాలి? ఆయా టెంపుల్ ఫండ్స్ ను అక్కడి అర్చకులకు, గోశాలలకు, గుడి అభివృద్ధికి యుటిలైజ్ చేసేలా చట్టం తీసుకొస్తే, అప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా సనాతన ధర్మాన్ని పాటించినట్టు. ఆచరణలో చూపించాలి కానీ, ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. ప్రజలు నాయకులను నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో నాయకులు ప్రవర్తించే తీరుపైనే ఏపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రజలు అజ్ఞానులు కారు, రాజకీయ చాణక్యం ఉన్నవారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, పోలవరం పూర్తి చేయడం, అమరావతి అభివృద్ధి చేయడం లాంటి హామీలను కూటమి సర్కార్ నెరవేర్చాలి. జగన్మోహన్ రెడ్డి చేసే దుష్ప్రచారాలపై దృష్టి పెట్టకుండా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలి. ముఖ్యంగా నారా లోకేష్ నిరంతరం ప్రజల్లో మెలగాలి. ఆయన ప్రతి నియోజకవర్గానికి ఒకరోజు కేటాయిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటే, తదుపరి ముఖ్యమంత్రి పీఠం ఆయనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

I am Sirisha N, an independent journalist and proud right-winger. With a Post Graduation from the AP College of Journalism, I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.
