“క్రికెట్ మ్యాచ్ కొలంబో వెళ్లి చూడాలా? ఇంట్లో టీవీలో చూడొచ్చుగా?” అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని, ఆయనలోని అసహనాన్ని మరోసారి బయటపెట్టాయి. తాను ఐదేళ్లు ఎలాగైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని టీవీల్లో, జూమ్ మీటింగ్స్లో రాష్ట్రాన్ని పాలించానో.. అందరూ అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లున్నారు.
సొంత డబ్బుతో వెళితే తప్పేంటి జగన్? నారా లోకేష్ కొలంబో పర్యటన పూర్తిగా ఆయన వ్యక్తిగతం. దీనికోసం ఆయన తన సొంత డబ్బు ఖర్చుపెట్టారు తప్ప, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాడలేదు. “నా ఫ్లైట్ టికెట్ నాదే, నా మ్యాచ్ టికెట్ నాదే.. నీ డబ్బులు ఏమైనా ఖర్చుపెట్టానా?” అని లోకేష్ అడిగిన సూటి ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సొంత పనులకు కూడా ప్రభుత్వ ఖజానా డబ్బుతో స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్లు వాడిన చరిత్ర ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తన సొంత డబ్బుతో మ్యాచ్ చూడటానికి వెళితే జగన్కు ఎందుకు అంత ఉలిక్కిపాటు?
ఆడేవాడికి, చూసేవాడికి తేడా అదే! లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో 4000 కిలోమీటర్లకు పైగా ఎండనక, వాననక ప్రజల మధ్య తిరిగారు. గ్రౌండ్ లోకి దిగి చెమటోడ్చి కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో ఆయనను, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ జగన్ మాత్రం ఐదేళ్లు పరదాల చాటున దాక్కుని, బారికేడ్ల మధ్య తిరిగి, ప్రజలకు నేరుగా ముఖం చూపించకుండా ప్యాలెస్ కే పరిమితమయ్యారు. మైదానంలోకి దిగి ఆడేవాడికి ఆట మీద ఉన్న ఇష్టం, ఏమీ చేయలేక ఇంట్లో కూర్చుని టీవీ చూసేవాడికి ఎలా అర్థమవుతుంది?
ప్రజలు శాశ్వతంగా టీవీ చూసుకునే డ్యూటీ ఇచ్చారు: జగన్ గారికి టీవీలు చూడటం ఎంత ఇష్టమో రాష్ట్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే, ఇకమీదట ఆయన ఎండలో తిరగకుండా, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని రోజంతా ‘సాక్షి’ టీవీ చూసుకునేలా కేవలం ’11 సీట్లు’ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు.
ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో, ఐటీ అభివృద్ధిలో లోకేష్ గ్రౌండ్ లో సిక్సర్లు కొడుతుంటే… అవి చూడలేక జగన్ ఇలాంటి సిల్లీ విమర్శలు చేస్తున్నారు. పారదర్శకంగా పాలిస్తూ, తన వ్యక్తిగత ఖర్చులను తన జేబు నుంచే పెట్టుకుంటున్న లోకేష్ను చూసి జగన్ చాలా నేర్చుకోవాల్సి ఉంది.