ఖమ్మం: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలోని షాదిఖానాలో ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని, మతసామరస్యం, సామాజిక ఐక్యతపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, “రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఉపవాస దీక్ష పాటిస్తూ, ఐదు సార్లు నమాజ్ చేస్తూ భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు ఈ పండుగను జరుపుకుంటారు. మతసామరస్యం ఎంతో అవసరం. గీతలో చెప్పినట్లుగా, మన మతాన్ని గౌరవించినట్లుగానే ఇతర మతాలను కూడా గౌరవించాలి. మతపరమైన వివేచనలు లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలి” అని పేర్కొన్నారు. ఖమ్మం నగర అభివృద్ధికి తాను మత భేదాలను పక్కన పెట్టి పనిచేశానని, ప్రజాసేవే తన ధ్యేయమని తెలిపారు.
ఈదుల్ ఫితర్ రోజున ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలవలేకపోయిన నేపథ్యంలో, ఈద్ మిలాప్ కార్యక్రమం ద్వారా సమాజంలోని వివిధ వర్గాల వ్యక్తులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. మతసామరస్యం, శాంతి, ఐక్యత కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హాఫిస్ జవాద్, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఖమర్, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, కార్పొరేటర్లు మక్బుల్, జహీర్ అలీ, నగర అధ్యక్షుడు నాగరాజు, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, కోటేశ్వరరావు, వలరాజు, జ్యోతిరెడ్డి, బుడిగం శ్రీను, మాజీ సుడ చైర్మన్ బచ్చు విజయ్, ఫిస్ సొసైటీ సుధాకర్, టౌన్ మైనారిటీ అధ్యక్షుడు షంసుద్దీన్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.