(కరీంనగర్ – పొలిటికల్ బ్యూరో): కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ చదరంగంలో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో చక్రం తిప్పారు. విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో సంజయ్ సంపూర్ణ విజయం సాధించారు.
ముందస్తు పొత్తుల ప్రచారం – ఆత్మరక్షణలో విపక్షాలు
మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తెరవెనుక మంతనాలు జరిపినట్లు, అక్రమ పొత్తులకు సిద్ధమైనట్లు తొలుత వార్తలు గుప్పుమన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఆయా పార్టీలు, మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశాయి. అయితే, బండి సంజయ్ రంగప్రవేశంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
‘గేర్’ మార్చిన బండి – వెనక్కి తగ్గిన బీఆర్ఎస్
“కరీంనగర్ గడ్డపై బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే” అంటూ బండి సంజయ్ ప్రజల్లోకి తీసుకెళ్లిన వాదన విపక్షాలను ఇరకాటంలో పెట్టింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసి మేయర్ స్థానాన్ని దక్కించుకున్నా.. ఆ ప్రభావం రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీవ్రంగా పడుతుందని, ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతామని విపక్ష నేతల్లో భయం పట్టుకుంది. బండి సంజయ్ అగ్రెసివ్ పాలిటిక్స్ దెబ్బకు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ రేసు నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అభివృద్ధే ఎజెండా..
సరైన సమయంలో గేర్ మార్చి, రాజకీయ చతురతతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కరీంనగర్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇకపై కరీంనగర్ అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలుస్తుందని, రాజకీయాలకు అతీతంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని నూతన మేయర్ ప్రమాణస్వీకారం అనంతరం ప్రకటించారు. మొత్తానికి బండి సంజయ్ మార్క్ రాజకీయం మరోసారి కరీంనగర్ గడ్డపై సత్తా చాటింది.
కరీంనగర్ పీఠం కైవసం – ఫలించిన ‘బండి’ వ్యూహం! బెడిసికొట్టిన విపక్షాల ఎత్తుగడలు